News

మోదీపై అసదుద్దీన్‌ విమర్శలు


పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నిరంకుశమైన పాలకుడని, తన ఇగో (అహం)ను సంతృప్తి పరుచుకునేందుకే నోట్ల రద్దుతో ప్రతి ఇంటికి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ స్వప్నిస్తున్న విప్లవం ఎన్నటికీ సాధ్యపడబోదని, ప్రజలు ఒత్తిడిలోకి కూరుకుపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఒక్క దెబ్బతో ప్రధాని పేదలు, అణగారిన వర్గాల ఉపాధిని నాశనం చేసి పారేశారని,  ఈ రోజు డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు కట్టిన వారే రేపు ఎన్నికల్లో ఓటింగ్‌కు కూడా క్యూ కడతారని, ఈ విషయాన్ని మోదీ మరిచిపోవద్దని గుర్తుచేశారు. ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ సందర్భంగా నగరంలోని ఐఏఎంఐఎం ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఒవైసీ నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగాఈ ఒవైసీ మాట్లాడుతూ మోదీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మీరు ఈ రోజు అధికారంలో ఉండొచ్చు. కానీ రేపు ఉండబోరు. ఎంతోమంది ప్రధానులు వచ్చారు పోయారు. మీరు కూడా దిగిపోక తప్పదు’ అని మోదీని ఉద్దేశించి అన్నారు.